ఆదేశించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : మూసాపేటలోని కాముని చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. రెండో విడత చేపడుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉందనే విషయం విధితమే. ఈ చెరువు పునరుద్ధరణను వెంటనే చేపట్టాలని అక్కడి స్థానికులు కమిషనర్ను కలిసి విన్నవించారు. కూకట్పల్లి నల్ల చెరువులా దీనిని కూడా అభివృద్ధి చేస్తే.. దోమల ఇబ్బందులు తగ్గుతాయని.. దుర్గంధం దూరమౌతుందని పలువురు పేర్కొన్నారు. దోమల వల్ల ప్రస్తుతతం నివాసాల తలుపులు తీయలేక పోతున్నామని వాపోయారు. అయితే ఈ చెరువు పునరుద్ధరణకు సంబంధించి హెచ్ ఎండీఏ నుంచి సాంకేతిక అనుమతులు రావాల్సి ఉందని.. అవి రాగానే పనులను స్పీడప్ చేస్తామని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్కు అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు వివరించారు.
ఈ లోగా దోమల ఇబ్బంది తలెత్తకుండా గుర్రపు డెక్కను తొలగించాలని, చెరువులోని మురుగు నీటిని బయటకు పంపాలని హైడ్రా కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాముని చెరువు నుంచి మూసాయి కుంటకు వెళ్లే వరద కాలువ పనులను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. కాలువ నిర్మాణాల్లో సాంకేతిక లోపాలను పరిశీలించి నిర్మాణ దశలోనే వాటిని పరిష్కరించాలని ఇరిగేషన్ సూచించారు. వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా కాలువ నిర్మాణ పనులను పూర్తి చేయాలని వాసవి నిర్మాణ సంస్థ ప్రతినిధులకు హైడ్రా కమిషనర్ సూచించారు. ఈ వర్షాకాలానికి చెరువును పునరుద్ధరించి.. ఫ్రెష్ వాటర్ చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.





