కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2046 కోట్ల రూపాయలు ఇచ్చాం అన్నారు.
పేదల వైద్యం కోసం 4500 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, కానీ టీచింగ్ కాలేజీలకు రోగులు రావడం లేదన్నారు. పేదలు వైద్యం కోసం వెళ్లే దగ్గర సరైన డాక్టర్లు లేరన్నారు.
ఆరోగ్య శ్రీ రోగులను టీచింగ్ కాలేజీలకు పంపించే ఆలోచన చేస్తున్నాం అని చెప్పారు సీఎం.. ఆరోగ్య శ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ను ఈ ఆస్పత్రులకు ఇస్తామన్నారు. దీని వల్ల ఆస్పత్రుల నిర్వహణ మెరుగు పడుతుందన్నారు. ఆస్పత్రుల నిర్వహణను గ్రూప్ వన్ అధికారికి ఇవ్వాలని అనుకుంటున్నాం అని తెలిపారు. కులగణనలో భాగం గా చేసిన జనగణన ఆధారంగా కోటీ 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా ఇవ్వబోతున్నామని వెల్లడించారు సీఎం. దీని వల్ల ప్రతి కుటుంబానికి ధీమా కల్పించ బోతున్నాం అన్నారు.
మన వాళ్లు వేల మంది డాక్టర్లు విదేశాల్లో పని చేస్తున్నారని అన్నారు. విదేశాల్లో పనిచేసే మన డాక్టర్ల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ తయారు చేస్తున్నాం అని తెలిపారు. మన ప్రాంతానికి వాళ్లు వచ్చినప్పుడు ఇక్కడ ఆస్పత్రుల్లో సేవలు అందించడానికి వెబ్ సైట్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నాం అని ప్రకటించారు.
వరంగల్, అల్వాల్, ఎల్ బీ నగర్, సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రులను స్పెషలైజేషన్ ఆస్పత్రులుగా మారుస్తున్నాం అని తెలిపారు.





