ప్రారంభమైన కోదండరామస్వామి ఉత్సవాలు
ఒంటిమిట్ట : దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో కోట్లాది మంది భక్తులు కొలిచే దైవం తిరుపతి జిల్లాలోని ఒంటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ఉత్సవాలకు అంకురార్పణం చేపట్టారు. టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలు వచ్చే నెల ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగుతాయి. ఈసారి భారీ ఖర్చుతో అన్నదానం కార్యక్రమం నిరంతరాయంగా నిర్వహించేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే ప్రారంభించారు.
ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. దీంతో శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు పోతన జయంతి కార్యక్రమం, కవి సమ్మేళనం చేపట్టారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవను భక్తులు వీక్షించారు.






