సంచలన ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ ఇక నుంచి రాజకీయ పార్టీగా మారబోతోందంటూ సంచలన ప్రకటన చేశారు మాజీ ఎమ్మెల్సీ, సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేస్తారన్న ప్రచారానికి తెర దించే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 25న మునీరాబాద్లో తాము పార్టీ జెండాను, అజెండాను ప్రకటిస్తామని చెప్పారు. ‘సర్వోదయ తెలంగాణ’గా ఆవిర్భవించడమే మా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం తాము కృషి చేస్తామని వెల్లడించారు కల్వకుంట్ల కవిత.
మా పూర్తి దృష్టి తెలంగాణ అభివృద్ధి పైనే కేంద్రీకృతమై ఉందని స్పష్టం చేశారు. మేము ఎవరికీ ‘బి-టీమ్’ (అనుబంధ బృందం) కాదని అన్నారు. తెలంగాణలో మా పార్టీయే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. పార్టీ ఏర్పాటు సభకు మహిళలు, యువత, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు తరలి రావాలని తాము పిలుపు ఇస్తున్నామన్నారు కవిత. ఒక రాజకీయ పార్టీలో అహంకారానికి తావు ఉండకూడదని ఆమె హితవు పలికారు. తనను విమర్శించిన వారు కూడా, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, వారు మాతో కలిసి రావచ్చు అని అన్నారు. మా అజెండా పూర్తిగా ఆచరణాత్మకమైనది, ప్రజల ఆమోదాన్ని పొందేదిగా ఉంటుందన్నారు. నేను ఏ పనినైనా చేపడితే, అది ఫలితాలను ఇచ్చేంత వరకు నేను దానిని వదిలిపెట్టను అని కవిత స్పష్టం చేశారు. నేను ఢిల్లీలో లాబీయింగ్ చేయగలను. అలాగే వీధుల్లోకి దిగి కఠోరంగా పోరాడ గలను అని అన్నారు.






