ఓ భక్తుడితో శ్రీ భగవాన్ రమణ మహర్షి
తమిళనాడు : తను లేక పోయినా ఇంకా కోట్లాది మంది భక్తుల్లో కొలువు తీరి ఉన్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. తాను నాస్తికుడినని ఒప్పుకున్న ఒక వ్యక్తి భగవాన్ శ్రీ రమణులను రెచ్చగొట్టే విధంగా దేవుడు ఉన్నాడా? మీరు దేవుని ఉనికిని నిరూపించగలరా? అని అడిగాడు. ఆయన చిరునవ్వుతో ఇలా జవాబిచ్చారు, దేవుడి గురించి ఎందుకు చింత? ఆయన తన గురించి తనే చింతించు కోనివ్వండి అని. ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారో కనుక్కోండి అని.
ఆ నాస్తికుడు అయోమయానికి గురయ్యాడు. శ్రీ రమణ మహర్షి అతనికి ‘నేను ఎవరు?’ అనే పుస్తకాన్ని చదవమని సలహా ఇచ్చారు. కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండాలనుకున్న ఆ సందర్శకుడు, చివరికి చాలా రోజులు ఉండి పోయాడు. చివరగా అతను ఇలా అన్నాడు. భగవాన్! నేను దేవుడిని నిరాకరిస్తూ, నాస్తికుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నాను. కానీ, ఇప్పుడు, ‘నేను ఎవరు?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత, పూర్తిగా గందరగోళానికి గురయ్యాను. నేను అధోగతి చెందానని అనిపిస్తోంది; అందుకే నేను చాలా దుఃఖంగా ఉన్నాను అని పేర్కొన్నాడు.
శ్రీ రమణుడు అతని వైపు చూసి చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు. నీ గందరగోళం అధోస్థితి కాదు. ఇన్నాళ్లుగా నీ అస్తిత్వం వెనుక ఉన్న సత్యం పట్ల నీవు ఉదాసీనంగా ఉన్నావు. ఇప్పుడు నీవు ఆ మౌలికమైన ప్రశ్నను లేవనెత్తావు; దాని ద్వారా నీవు ఉదాసీనత నుండి బయట పడ్డావు. కాబట్టి ఇది కేవలం ఒక ఉన్నతి మాత్రమే! ఉదాసీనత నుండి గందరగోళానికి, గందరగోళం నుండి స్పష్టతకు, (మేధో) స్పష్టత నుండి అనుభవానికి, అనుభవం నుండి ఆత్మలో స్థిర పడటానికి – ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతి క్రమం ఇదే అని పేర్కొన్నారు.






