కీలక ప్రకటన చేసిన ఏపీ రాష్ట్ర మంత్రులు
అమరావతి : తిరుపతి జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీకోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున భక్తులు వచ్చారు. ఈ సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. శనివారం ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు వంగలపూడి అనిత, ఎస్. సవిత, అనగాని సత్య ప్రసాద్, ఆనం రామ నారాయణ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన, భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, పార్కింగ్, తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ మంత్రులు. భద్రతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు ప్రత్యేకంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒంటిమిట్టలో నిత్య అన్నదానం కోసం శ్రీకారం చుట్టారు.





