రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : రాష్ట్రంలో వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల మనస్సుల్లో హీరోగా నిలిచారని, రాష్ట్ర పతనాన్ని కోరుకుంటున్న జగన్ ను విలన్ గా చూస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చోరీలకు కేరాఫ్ అడ్రాస్ జగన్ అని విమర్శించారు. ఆయన చోరీలను క్రెడిట్ చేసుకోవాల్సిన దుస్థితి ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. చేనేతలు గౌరవ ప్రదమైన జీవనం సాగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే ఎన్నికల హామీని నెరవేరుస్తూ నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు.
ఇప్పటికే చేనేత రంగ అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలతో పాటు ఉచిత విద్యుత్ పథకానికి నాంది పలుకడంతో నేతన్నలకు మరింత ఆర్థిక పరిపుష్టి కలగనుందన్నారు సవిత. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్డు కాలనీలో బుధవారం నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన ధ్రువ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సూపర్ సిక్స్ పథకాలను విజయవంతం చేసిందన్నారు. మహిళలకు, దివ్యాంగులకు, రైతులకు, నేతన్నలకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇటీవలే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలే కల్పనే లక్ష్యంగా ఉగాది పండుగ నాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు.





