ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కొనసాగింపు
అమెరికా : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ బుధవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది తమ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు. గత కొన్ని రోజులుగా తొలగించ బోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఇవాల్టి లే ఆఫ్స్ లెటర్స్ జారీతో నిజమైంది. ఒరాకిల్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత పెట్టింది .దీని ప్రభావం ఇండియాపై కూడా గట్టిగా పడింది. చాలా టీమ్స్కు ఉదయం 5-6 గంటలకు ఈ-మెయిల్స్ వచ్చాయి. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందనేది మెయిల్ సారాంశం.
ఇదిలా ఉండగా ఒరాకిల్ సంస్థకు ఇండియాలో 30 వేల మంది ఉద్యోగులున్నారు. వీళ్లలో 12వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది కంపెనీ. మరో విడత కూడా ప్రక్షాళన ఉంటుందని టాక్. ఇక భారత్ వరకు వస్తే ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి, తొలగింపు తేదీ వరకు ఒక నెల చెల్లించని వేతనాలతో పాటు, 15 రోజుల జీతాన్ని కూడా కంపెనీ ఆఫర్ చేసింది. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. నెల రోజుల్లోగా మరో విడత తొలగింపులు ఉండవచ్చని ప్రభావిత ఉద్యోగులు తెలిపారు. ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఒరాకిల్ నిరాకరించింది.







