ఏర్పాటు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ : కాళేశ్వరం బ్యారేజి పనులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రోజువారీ పర్యవేక్షణ, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పునరుద్ధరణ పనుల అమలుకు నాయకత్వం వహించడానికి, కల్నల్ పరిక్షిత్ మెహ్రాను కన్వీనర్గా నియమిస్తూ, ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమవుతుందని వెల్లడించారు. పురోగతిని సమీక్షించడానికి అవసరమైతే తాను కూడా వర్చువల్ గా పాల్గొంటానని చెప్పారు. ఒక ప్రత్యేక అధికారి ప్రతిరోజూ పురోగతిని పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
శిబిరాలను పునరుద్ధరించి, పూర్తి మద్దతు ఇవ్వాలని ఏజెన్సీలను ఆదేశించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఎల్&టితో సహా అమలు చేస్తున్న ఏజెన్సీలు తమ ప్రస్తుత శిబిరాలు, మెస్ సౌకర్యాలు, ఇతర సదుపాయాలను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు , రిగ్ ఆపరేటర్లకు వసతి లేదా ఆహార సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇసుక తొలగింపు, జీపీఆర్ (భూభౌతిక) పరీక్షలు, సైట్ తయారీ పనులు పూర్తి ఏజెన్సీ సహకారంతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని పరీక్షలను డిజైనర్, సీడబ్ల్యూపీఆర్ఎస్, శాఖా ఇంజనీర్లు , ఏజెన్సీ ప్రతినిధులు సంయుక్తంగా పర్యవేక్షించాలని, అలాగే ప్రతిదీ సక్రమంగా నమోదు చేయాలని మంత్రి నొక్కి చెప్పారు. ఈ చర్చల్లో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, సొరంగ నిపుణుడు, కార్యదర్శి కల్నల్ పరిక్షిత్ మెహ్రా, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, (ఈఎన్సీ జనరల్) రమేష్బాబు, సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస్, ఈఎన్సీ (పరిపాలన) టి. శ్రీనివాస్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ అదనపు డైరెక్టర్ సెల్వ బాలన్ తదితర అధికారులు పాల్గొన్నారు.






