క్వాంటం వ్యాలీకి కేరాఫ్ కానున్న అమరావతి
అమరావతి : ఏపీ రాజధాని అమరావతి క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా మారనుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లో 1 ఎస్ పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటం టెస్ట్ బెడ్ ను నిర్మించారు. ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ లాంటి సంస్థలు సహకారం అందించాయి.
దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ సహా, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్ ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరు కానున్నారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్ గా దాదాపు 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.






