మోదీ నాయ‌క‌త్వం భార‌త్ కు అగ్ర‌స్థానం

VijayaBhaskar · May 12, 2026
Spread the love

ప్ర‌శంస‌లు కురిపించిన సీఎం చంద్ర‌బాబు

న్యూఢిల్లీ : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇండియా ఇప్పుడు వ‌ర‌ల్డ్ లో టాప్ లో కొన‌సాగుతోంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీలో జ‌రిగిన సీఐఐ స‌మ్మిట్ లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. గతంలో పశ్చిమ బెంగాల్ దేశానికే ఆదర్శంగా ఉండేదన్నారు. కాని గత కొంత కాలంగా ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఆలోచనలే లేకుండా పోయాయని ఆవేద‌న చెందారు. సంస్కరణల వాది అయిన ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 8 అంశాలతో కూడిన నేషనల్ మిషన్ ను ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చారని అన్నారు.

బంగారం కొనుగోలును వాయిదా వేయాలని, ఇంధనాన్ని పొదుపుగా వాడాలని, విద్యుత్ ఉత్పత్తిని కూడా సూచించారని గుర్తు చేశారు. ప్రతీ ఇల్లూ, పరిశ్రమ, పొలం అన్నీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా రవాణాను వినియోగించాలని కూడా ప్రధాని స్పష్టంగా పేర్కొన్నార‌ని అన్నారు.
యుద్ధానంతర పరిస్థితుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు మనం చూశామ‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు సీఎం. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న నినాదాన్ని కూడా ప్రధాని ఇచ్చారు. దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మనకు ఉన్నాయన్నారు. గ్రేటర్ సెల్ఫ్ రిలయన్స్ అనే అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ప్రకృతి సేద్యం అన్నది ఓ కీలకమైన అంశంగా మారిందన్నారు. తద్వారా ఎరువుల దిగుమతి తగ్గుతుందని చెప్పారు.