జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి : ఏపీని వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. పల్నాడు(జి) పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు(జి) గూడూరులో 44.9°C, కృష్ణా(జి) కంకిపాడులో 44.5°C, మార్కాపురం(జి) పెదచెర్లోపల్లిలో 44.2°C, ప్రకాశం(జి) సంతనూతలపాడులో 44.1°C, బాపట్ల(జి) ఇంకొల్లులో 43.2°C, ఎన్టీఆర్(జి) కంచికచర్లలో 43.1°C, గుంటూరు(జి) పాండ్రపాడులో 43°C, నంద్యాల(జి) సంజామలలో 42.9°C, అనకాపల్లి(జి) దేవరాపల్లి 42.8°C, తూర్పు గోదావరి (జి) బ్రాహ్మణగూడెం, మన్యం(జి) సాలూరు, తిరుపతి(జి) బోనుపల్లె, వైఎస్సార్ కడప(జి) ఒంటిమిట్టలో 42.7 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
మరోవైపు కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాయలసీమలో చెదురు మదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు





