స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
నెల్లూరు జిల్లా : గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అందించలేదు. అన్ని రంగాలను విధ్వంసం చేశారు.. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అలాగే మత్స్య రంగం కూడా దెబ్బతినేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికున్న సుదీర్ఘమైన తీరప్రాంతంలో లక్షల మంది మత్స్య కారులు చేపల వేటతో ఉపాధి పొందుతున్నారు. వారికి నాటి ఐదేళ్ల పాలనలో కష్టాలే ఉన్నాయి. 2019-24 మధ్యలో చేపల ఉత్పత్తి దారుణంగా పడిపోయిందన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత మత్స్య సంపద పైనే ఎక్కువ మంది ఆధార పడుతున్నారని తెలిపారు. ఇలాంటి రంగాన్ని కూడా వాళ్లు విధ్వంసం బాట పట్టించారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ లేనిపోని కుట్రలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం చేస్తుంటే గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలు చేస్తోందన్నారు. బాబాయ్ హత్య నుంచి పెద్ద దస్తగిరి వరకూ హత్యలు చేస్తూ… కుట్రలు పన్నుతూ రాష్ట్రాన్ని వెనక్కు లాగుతోందన్నారు.
వైసీపీ చేసిన విధ్వంసాన్ని సరి చేయడానికి 23 నెలల సమయం పట్టిందన్నారు సీఎం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించటంతో పాటు విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా ఏపీని అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. బుల్లెట్ స్పీడ్ లో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 24 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. రాయలసీమలో డిఫెన్సు, డ్రోన్స్, స్పేస్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలు వస్తున్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ తిరుపతి వద్ద బుల్లెట్ మోటారు సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందన్నారు. నెల్లూరు జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. మరిన్ని వస్తాయన్నారు. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలో 25 మత్స్య కారుల గ్రామాలను కనెక్టు చేస్తూ మెటల్ రోడ్లు వేస్తాం అన్నారు. నార్త్ బకింగ్ హామ్ కెనాల్ డీసిల్టింగ్ కు రూ.6.19 కోట్లను మంజూరు చేస్తున్నాం అన్నారు. ఈ కాలువను ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ గానూ తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. ప్రతీ ఇంటిపైనా, పొలంలోనూ సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి చెప్పారు.





