సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు
నెల్లూరు జిల్లా : రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయని, అక్కడ చేపల పెంపకం చేపట్టాలని, తానే మార్కెటింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ మత్స్య సంపదను విక్రయించుకునే హక్కులను మత్స్య కారులకే అప్పగించాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను అందించేలా మత్య్స శాఖకు ఆదేశాలిచ్చాం అని తెలిపారు సీఎం. చేపల వేటతో పాటు కొత్త ఆదాయ మార్గాలను కూడా మత్స్య కారులకు అందుబాటులోకి తెస్తాం అన్నారు. మన రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉందని, సముద్ర తీరప్రాంతంలో నివసించే మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు చేపడుతున్నాం అన్నారు.
టెక్నాలజీతో పాటు… వినూత్న పద్దతుల ద్వారా మత్స్య కారులను ఆర్థికంగా ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. చేపల వేటకు వెళ్లే మత్స్య కారులకు అండగా నిలబడడమే కాకుండా… మత్స్య కార మహిళలకు ఉపాధి కల్పించి.. ఆర్థిక సాధికారత కల్పిస్తాం అని భరోసా ఇచ్చారు. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం అన్నారు. మత్స్య కార మహిళలు, డ్వాక్రా సంఘాల మహిళలు సముద్రపు నాచు పెంపకం ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చేస్తామని తెలిపారు. చేపలు మంచి పౌష్టికాహారం. ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రోటీన్ ఉన్న ఈ ఆహారానికి అన్ని చోట్లా గిరాకీ ఉందన్నారు. మత్స్య ఉత్పత్తులకు గిరాకీ సృష్టించేలా మార్కెటింగ్ మేనేజర్ గా వ్యవహరిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు.





