కీలక ప్రకటన చేసిన ఏపీ కూటమి సర్కార్
అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ముస్లిం సోదరులు జరుపుకునే బక్రీద్ పండుగకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 28న సెలవు దినాన్ని మారుస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా బక్రీద్ పండుగ సందర్భంగా మే 28 గురువారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ G.O. Rt. No. 1006 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. నెలవంక దర్శనం (చంద్ర దర్శనం) విషయమై ముస్లిం సమాజం నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బక్రీద్ (ఈద్-ఉల్-అధా) ప్రభుత్వ సెలవు దినాన్ని మే 27 నుండి మే 28కి మార్చింది.
కాగా నెలవంక దర్శనం విషయమై ముస్లిం సమాజం నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బక్రీద్ (ఈద్-ఉల్-అధా) ప్రభుత్వ సెలవు దినాన్ని మార్చింది. అంతకు ముందు, ఈ పండుగకు మే 27న సెలవు దినంగా ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే, చంద్రమాన క్యాలెండర్ , నెలవంక దర్శన అంచనాల ఆధారంగా బక్రీద్ పండుగను మే 28న జరుపుకునే అవకాశం ఉంది. పండుగ ఆచరణకు అనుగుణంగా సెలవు తేదీని సవరించాలని కోరుతూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యనిర్వాహక అధికారి విజ్ఞప్తి సమర్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 27న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.





