బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రకటన
హైదరాబాద్ : ముదిరాజ్ కులాలను బీసి -ఏ కేటగిరీలో చేర్చితే ఒప్పుకోం అని స్పష్టం చేసింది బీసీ – ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి. తెలంగాణ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బడుగు బలహీన వర్గాల నేత వి.హనుమంతరావుని కలిసి బీసీ ఏ కులాల తరఫున వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ – ఏ కులాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వృత్తి ఆధారిత , సేవా కులాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ కులాలు అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
సాంప్రదాయ వృత్తులు కోల్పోవడంతో బీసీ – ఏ కులాలకు చెందిన అనేక కుటుంబాలు నేడు దినసరి కూలీలు, ప్లంబర్లు, మేస్త్రీలు, ఆటో డ్రైవర్లు, చెత్త సేకరణ కార్మికులుగా జీవనం కొనసాగిస్తున్నాయని వాపోయింది. గ్లోబలైజేషన్ ప్రభావంతో వృత్తులు కోల్పోయిన పలువురు ఫుట్పాత్లపై వివిధ వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించింది. సంచార, అర్ధసంచార, భిక్షాటన ఆధారిత కులాలు కూడా బీసీ ఏలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ – డీ వర్గంలో ఉన్న ముదిరాజ్ కులాలను బీసీ – ఏలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.





