స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజారెడ్డి నుంచి వివేకా వరకు ప్రతి చావులో జగనే ప్రధాన లబ్ధిదారు అని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ను సైకో అనాలా… పిచ్చోడు అనాలా అర్థం కావడం లేదు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిపై జగన్ చేస్తున్న విమర్శలను ఖండించారు. అమరావతికి రాజముద్ర పడిన తర్వాత కూడా మావిగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, ఐకానిక్ రాజధాని రోడ్లు అన్నీ ఒకేలా ఉంటాయా? అని ప్రశ్నించారు. విశాఖలో జగన్ కట్టుకున్న ప్యాలెస్కు ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే జగన్ ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు.
ఆస్తి, పదవి కోసం కార్యకర్తలను కూడా వదలరని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ఆ పార్టీ కార్యకర్తనే కారు కింద వేసి తొక్కించేశారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. జీతాలు ఇస్తే చాలు అని ఉద్యోగులతో దండాలు పెట్టించుకున్నారని పేర్కొన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా జగన్ తగ్గించ లేదన్నారు. ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రతి అంశాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నామని, విద్యుత్ ఛార్జీలను తగ్గించిన చరిత్రను ఎన్డీయే ప్రభుత్వం సృష్టించిందన్నారు. ఇకపై జగన్ చేసే ప్రతి అబద్ధపు ఆరోపణకు వడ్డీతో సహా సమాధానం చెబుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.






