స్పష్టం చేసిన టీటీడీ అదనపు ఈవో చౌదరి
తిరుమల : భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో టీటీడీ ఆరోగ్య శాఖ, FSSAI, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార భద్రత, పరిశుభ్రతలపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో వారికి నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం టీటీడీ బాధ్యత అని అన్నారు. ఆహార తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియల్లో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఇప్పటికే తిరుమలలో ఆహార భద్రత, పరిశుభ్రతపై పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినప్పటికీ, వాటిని నిరంతరం కొనసాగించేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో అవసరమని చెప్పారు. టీటీడీ అన్నప్రసాదంలో నాణ్యమైన ఆహార ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తోందన్నారు. అదే రీతిలో తిరుమల లోని వివిధ హోటల్స్ కూడా ఉన్నత ఆహార ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. తిరుమలలో ప్రస్తుతం సుమారు 325 దుకాణాల్లో(street vendors) ఆహార విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వాటిలో దాదాపు 1,300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థల యజమానులు తమ సిబ్బందికి పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.
నెస్లే ఇండియా సంస్థ ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారికి గ్లోవ్స్, ఆప్రాన్, సబ్బులు, టోపీలు తదితర వస్తువులు ఉండే కిట్లను ఉచితంగా అందజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఆహార విక్రయ కేంద్రాల్లో మరింత పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమలలో పరిశుభ్రతను మరింత మెరుగు పరచడం, భక్తులకు సురక్షితమైన ఆహారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు ఈవో తెలిపారు.






