ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం
అమరావతి : అక్షర యోధుడు రామోజీరావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు అని పేర్కొన్నారు. మీడియా రంగంలో ఓ యుగకర్త, అక్షర యోధుడు రామోజీరావు గారి 2వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించి, మీడియాను ప్రజా చైతన్యానికి వేదికగా మలిచిన ఆయన సేవలు చిరస్మరణీయం అని ప్రశంసించారు సీఎం.
విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత, ధైర్యసాహసాలతో నడిచిన ఆయన ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. పత్రికా రంగం అంటే వ్యాపారం కాదు…సామాజిక బాధ్యత అని భావించి ఆచరించి చూపిన ఆదర్శవాది రామోజీ రావు అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించే మీడియా సంస్థలను అందించిన ఆయన స్థానం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి పోతుందన్నారు సీఎం. రామోజీరావు కీర్తి అజరామరం. వారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరం స్మరించుకుందాం అని పిలుపునిచ్చారు నారా బాబు.





