ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
అమరావతి : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నామన్నారు. ప్రమాదం గురించి విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. స్టీల్ ప్లాంట్ లో చేపట్టిన సహాయ చర్యలపై ఆరా తీశారు. అధికారులంతా సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని దిశా నిర్దేశం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఇవాళ ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. మరో వైపు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఘటనా స్థలం వద్దనే ఉన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా సర్కార్ ప్రకటించింది.






