రెండేళ్లుగా సుపరిపాలన అందించాం
తిరుపతి : ప్రజా ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సుపరిపాలన అందించాం అన్నారు మంత్రి నారా లోకేష్. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రూ.2 వేల పెన్షన్ ఒకేసారి రూ.4 వేలకు పెంచాం. అన్నా క్యాంటీన్లు, డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ, 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, ఇప్పుడు జాబ్ క్యాలండర్ ద్వారా 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. అదేవిధంగా చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాం. ఆటోవాలా సేవలో, మత్స్యకార సేవలో, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి ఉచిత బస్సు, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలండర్ల అందజేత, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం వంటివి అమలు చేస్తూ జనరంజక పాలన అందిస్తున్నాం.
ప్రజా ప్రభుత్వ నినాదం ఒక్కటే. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. దేశంలోకి వచ్చిన ప్రతివందలో 25శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి బడా సంస్థలు ఉత్తరాంధ్రకు క్యూ కట్టాయి. రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతమవుతోంది. రాయలసీమకు ఎవరూ ఊహించని విధంగా ఫైటర్ జెట్స్ పరిశ్రమను, రాయల్ ఎన్ ఫీల్డ్ ను రప్పించాం. మనది గూగుల్… వాళ్లది గొడ్డలి. మనది ఫైటర్ జెట్స్… వాళ్లది ఫ్యాక్షన్. మనది కియా… వాళ్లది కిడ్నాప్. మనది విశ్వసనీయత… వాళ్లది నేరం. మనది అభివృద్ధి… వాళ్లది విధ్వంసం. మనది బుల్లెట్… వాళ్లవి బూతులు… మనది మహిళలకు 33% రిజర్వేషన్ … వాళ్లది సొంత తల్లిని, చెల్లిని గెంటేయడం. జగన్ అనే పేరులో ఉన్న జీ ని జెన్ జీ అనుకుంటున్నాడు. కానీ జగన్ లో ఉన్న జీ అంటే గొడ్డలి.





