అదుపు లోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ
అమరావతి : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఏపీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తులను అదుపు లోకి తీసుకుంది.
ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని, ఏపీఎస్బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి.వాసుదేవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు ఈడీ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది.
ఈ ఇద్దరినీ హైదరాబాద్ నాంపల్లిలో ఎంపీఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు..కేసి రెడ్డి, వాసుదేవ రెడ్డిలకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
హైదరాబాద్లోని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 25 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారిని ఈడీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు. మద్యం అక్రమ రవాణా కేసుపై సిట్ ఛార్జ్ షీట్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ . మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయ సాయిరెడ్డి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిని కూడా అరెస్ట్ చేసింది.
వీరితో పాటు జగన్ OSD కృష్ణ మోహన్రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలతో పాటు APSBCL పూర్వపు ఎండీ డి.వాసుదేవరెడ్డి, APSBCL ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్రెడ్డి, మద్యం ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్రెడ్డి, వీరి అనుచరులు బూనేటి చాణక్య, టి.కిరణ్కుమార్రెడ్డి, సైఫ్ అహ్మద్తో పాటు మద్యం ముడుపుల సొత్తు రూటింగ్ కోసం వినియోగించిన పలు డొల్ల సంస్థల యాజమాన్యాలను ఈ కేసులో నిందితులుగా చేర్చింది.





