విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
శ్రీ సత్యసాయి జిల్లా : తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా రాయలసీమకు చెందిన 84 మంది కురుబ, కురుమ, కురవ విద్యార్థులకు రూ.36 లక్షల నగదు పురస్కారాలను మంత్రి ఎస్. సవిత అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదవి, టెన్త్ లో 580 మార్కులు సాధించిన 26 మంది విద్యార్థులకు రూ.25 వేల చొప్పున రూ. 6.50 లక్షల నగదును అందజేశారు. ఇంటర్ లో 950 మార్కులు సాధించిన 59 మంది విద్యార్థులకు రూ. 50 వేల చొప్పున రూ.29.50 లక్షలు ఇచ్చారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు కూడా అందజేస్తున్నామని చెప్పారు ఎస్. సవిత. తన తండ్రికి విద్య అంటే ఎంతో మక్కువని, అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పదని భావించే వారని అన్నారు.
అందుకే ఆయన పేరు మీద చదువులో రాణించే పేద విద్యార్థులకు ప్రోత్సహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. అంతకు ముందు తల్లిదండ్రులు దైవ స్వరూపాలని పేర్కొంటూ, విద్యార్థులతో మంత్రోచ్ఛరణాల తమను కన్నవారి కాళ్లు కడిగించారు. మంత్రి సవితను కురబ సామాజిక వర్గీయులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ప్రతిభ పురస్కారాల ప్రదానం అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సవిత భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రాష్ట్ర కురబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, విద్యార్థులు, వారి తల్లిండ్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





