తనదైన ముద్ర వేసిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్
చెన్నై : తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త చరిత్రకు నాంది పలికారు టీవీకే పార్టీ చీఫ్, సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విజయ్ నేతృత్వంలోని తమిళనాడులో టీవీకే పాలనాకాలం ఒక నెల గడిచింది. ఇది ద్రావిడ రాజకీయాలను మార్చేసింది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. పరిస్థితిని అంచనా వేయడానికి ఇది చాలా తక్కువ సమయం, కానీ సాధారణంగా విజయ్ ఆకట్టుకున్నారు. ఒక సినీ నటుడిగా ఆయనకున్న ఆకర్షణ, మార్పు తెస్తుందనే వాగ్దానంపై కేంద్రీకరించిన ప్రచారం ఎన్నో ఆశలను రేకెత్తించాయి.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన సమయ పాలన పాటిస్తారు. చక్కగా కుట్టిన నల్ల సూట్, తెల్ల చొక్కా ధరించి సచివాలయానికి సమయానికి వస్తారు. సోషల్ మీడియా యుగంలో ఆయన పనితీరు బాగుంది – సోమవారం నుండి శుక్రవారం వరకు దాదాపు 8 గంటలు పని చేస్తారు. ఆయన అధికార యంత్రాంగంలో ఎలాంటి అలజడి సృష్టించ లేదు, వారంతా సమన్వయంతో పని చేస్తున్నారు, ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో విజయ్ నెరవేర్చాల్సిన ఎన్నికల హామీలు చాలా ఉన్నాయి. కాబట్టి, ఆయన ఎన్నికల హామీలను అమలు చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది.
అవినీతిపై ఆయన చేపట్టిన చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. విపరీతమైన అవినీతికి పేరుగాంచిన టాస్మాక్ విభాగాన్ని ప్రక్షాళన చేయడానికి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం జరుగుతోంది.అయితే, శాంతిభద్రతలు ఆయనకు అతిపెద్ద సవాలుగా మిగిలి పోయాయి. శాంతిభద్రతలు కల్పిస్తామని, మహిళలపై హింసను అరికడతామని హామీ ఇచ్చి టీవీకే అధికారంలోకి వచ్చారన్నది గుర్తొస్తుంది. కానీ గత నెల రోజులుగా, ఈ విషయంపై టీవీకే తీవ్రమైన ప్రజా, రాజకీయ విమర్శలను ఎదుర్కొంటున్నారు. కఠినమైన, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.
నటుడిగా ఉండి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను నివారించే లక్ష్యంతో ‘సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్’ అనే ప్రత్యేక మహిళా పోలీసు విభాగాన్ని ప్రారంభించి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రంలో రాజకీయాలను ప్రజలు చూసే విధానంలో విజయ్ ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చారు. స్పష్టమైన రాజకీయ దార్శనికత కంటే, రెండు ప్రధాన ద్రవిడ పార్టీలపై ప్రజలలో పెరుగుతున్న నిరాశ, అసంతృప్తియే ఆయనకు అతిపెద్ద బలంగా నిలిచింది. టీవీకే ఇంకా తమ రాజకీయ సిద్ధాంతాన్ని వెల్లడించలేదు. ముఖ్యమంత్రిగా విజయ్ క్రమం తప్పకుండా పత్రికా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
ఒకసారి విజయ్ అసెంబ్లీలో 144 ఓట్లతో తన మెజారిటీని నిరూపించుకుని, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ మరియు 25 మంది రెబెల్ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో, ఆయన గెలుపు ఖాయమైపోయింది. అయితే, ఇక్కడ విమర్శకుల మధ్య ఉన్న వివాదాంశం ఏమిటంటే, టీవీకే సొంతంగా మెజారిటీ సాధించలేక కేవలం 107 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కానీ ఇప్పటివరకు ఆయన ప్రయాణం సాఫీగా సాగిపోతోంది.
తమిళనాడులో ప్రతిపక్షం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. డీఎంకే సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపడుతుండటంతో, అది తన పూర్వ వైభవానికి నీడలా మాత్రమే మిగిలింది. ఏఐఏడీఎంకే అంతర్గత కలహాలతో అగాధంలో కూరుకు పోయింది, పార్టీలో సగం మంది ఫిరాయించడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో సుపరిచితుడైన అన్నామలై తనకంటూ ఒక రాజకీయ స్థానాన్ని సృష్టించు కోవడానికి ముందుకు రావడంతో, తమిళనాడులో బీజేపీ గురించి ఎవరూ మాట్లాడటం కూడా లేదు.
ఇదిలా ఉండగా, విజయ్ అపారమైన ప్రజాదరణతో దూసుకుపోతూ, పెత్తనం చెలాయిస్తున్నారు. ఆయన విమర్శకులు ఆయన్ను కిందకి లాగడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఆయన ఇక్కడే నిలదొక్కుకుంటారు.







