భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి
తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. కోట్లాది మంది శ్రీ వేంకటేశ్వర స్వామిని కొలుస్తారు. ఆయనను సేవిస్తారు. జీవితంలో ఒక్కసారైనా స్వామిని దర్శంచుకుంటే జన్మ ధన్యమవుతుందని భావిస్తారు భక్త బాంధవులు. ఇదిలా ఉండగా ప్రతీ రోజూ తిరుమలకు 80 వేల మందికి పైగా భక్తులు వస్తున్నారు. వీరిలో దర్శనం సమయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినా లేదా ఆరోగ్య పరంగా సమస్యలు ఉన్నా వెంటనే చికిత్స చేయించేందుకు టీటీడీ వైద్యశాలలను ఏర్పాటు చేసింది.
తాజాగా శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో ఆధునీకరించిన డిస్పెన్సరీని ప్రారంభించింది .భక్తులకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు డిస్పెన్సరీలో ఈసీజీ, ఆక్సిజన్ సదుపాయం, ఆధునిక వైద్య పరికరాలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. నలుగురు వైద్యులు, 16 మంది పారామెడికల్ సిబ్బంది సేవలందించనుండగా, 24 గంటల అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, సీఎంఓ డాక్టర్ కుసుమ కుమారి, ఎస్ఎంఓ డాక్టర్ సుహర్ లత, అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి, డాక్టర్ పద్మజ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏఈవో శ్రీ మణి, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.






