నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
తాడేపల్లిగూడెం : మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో సీఎం చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారు వీరిలో చాలామంది ఉన్నారని అన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్క చెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిలు పెట్టారని పేర్కొన్నారు మాజీ సీఎం .
గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.1000 ఉండే జీతాన్ని రూ.3000 వేల వరకూ వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు , ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వీరిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున పోరాడుతాం అని ప్రకటించారు జగన్ రెడ్డి. వారికి అండగా నిలుస్తాం అన్నారు. ఇప్పటికే బకాయి పెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని అన్నారు.






