తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించే దిశగా తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసం పరిసర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు సిబ్బందికి సుమారు 80 సంవత్సరాల వయస్సు గల ఓ వృద్ధ మహిళ రెండు రోజులుగా నిరాశ్రయ స్థితిలో అక్కడే ఉంటున్నట్లు స్థానికులు సమాచారం అందించారు. మహిళా పోలీసు సిబ్బంది వెంటనే ఆమె వద్దకు వెళ్లి వివరాలు సేకరించగా, తన పేరు విమలమ్మ, భర్త పేరు కొదండ రామారావు అని మాత్రమే చెప్పగలిగింది. వయోభారం కారణంగా ఆమె తన చిరునామా సహా ఇతర వివరాలను తెలియ జేయలేని పరిస్థితిలో ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఆమెకు అవసరమైన సహాయం అందించి, తుకివాకలోని ఆశ్రయ వెల్ఫేర్ సెంటర్కు సురక్షితంగా తరలించి చేర్పించి, అవసరమైన సంరక్షణ కల్పించారు . ఈ సందర్బంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు. పోలీసుల బాధ్యత కేవలం నేర నియంత్రణ మాత్రమే కాదు, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడం కూడా అని స్పష్టం చేశారు. వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించడం ప్రతి కుటుంబ సభ్యుడి నైతిక, సామాజిక, చట్టబద్ధమైన బాధ్యత అని అన్నారు. వారిని ప్రేమతో, గౌరవంతో చూసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం కొంత మంది వృద్ధులు ఒంటరితనం, అనారోగ్యం లేదా ఇతర పరిస్థితుల కారణంగా నిరాశ్రయులుగా మారడం సమాజాన్ని ఆలోచింపజేసే అంశం.
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా నిరాశ్రయులు, దిక్కులేని వృద్ధులు లేదా సహాయం అవసరమైన వ్యక్తులు కనిపిస్తే ప్రజలు మానవత్వంతో స్పందించి వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవత్వం, సహానుభూతి కలిగిన సమాజ నిర్మాణానికి అందరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నానని అన్నారు.





