హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో హైడ్రా ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ చెరువులు, స్థలాలు, భూములను భారీ ఎత్తున కాపాడింది. అక్రమార్కులకు చెక్ పెట్టింది. హైడ్రాకు మద్దతుగా నగర వాసులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకలే దీనికి నిదర్శనం. తమ ప్రాంతాల్లోని పార్కులు, ప్రజల వినియోగం కోసం ఉద్దేశించిన స్థలాలను కాపాడి, వాటికి కొత్త జీవం పోసిన తీరును అభినందిస్తూ కొన్ని కాలనీల్లో సంబరాలు జరుపుకున్నారు. HYDRA చెరువులను పునరుద్ధరించి, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించిందని ప్రజలు ఇతర ప్రాంతాల్లో వేడుకలు చేసుకున్నారు. కొండలు, గుట్టలతో కూడిన పచ్చని ప్రభుత్వ భూములను ఆక్రమణల నుండి కాపాడేందుకు తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ మరికొందరు సంబరాలు నిర్వహించారు. HYDRA కంచె వేసి రక్షించిన ప్రభుత్వ భూముల వద్ద బాణసంచా కాల్చి, విజయభేరి మోగించారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు హుస్సేన్ సాగర్ మరియు నెక్లెస్ రోడ్డు వద్దకు చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. NTR గార్డెన్స్ నుండి లుంబినీ పార్క్ వరకు జరిగిన ఈ భారీ ర్యాలీలో ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. HYDRAను ఏర్పాటు చేసి నగరానికి ఉజ్వల భవిష్యత్తును అందించిన ముఖ్యమంత్రి భారీ కటౌట్కు వారు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన HYDRA దేశానికే ఆదర్శమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు , ప్రజల వినియోగం కోసం ఉద్దేశించిన స్థలాలను కాపాడేందుకు జిల్లాల్లోనూ చర్యలు చేపట్టి, HYDRAను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చాలామంది డిమాండ్ చేశారు. రెండేళ్లలో 3,315 ఎకరాల భూమిని కాపాడినందుకు HYDRAను వారు అభినందించారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ భూముల విలువ కనీసం రూ. 1.50 లక్షల కోట్లు ఉంటుందన్నారు.





