హైదరాబాద్ : యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, తన తండ్రి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్. ఈ మేరకు ఆమె టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు. నాపై, నా కుటుంబంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అసభ్య, అనుచిత వ్యాఖ్యల విషయం తమరికి తెలిసినదే. ఈ విషయంలో వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తం గా యాదవ, బీసీ సంఘాల నుంచి విమర్శలు, నిరసనలు వ్యక్తమైనా ఇప్పటి వరకు చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. నా నియామకం పట్ల అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీపై మరింత అభిమానాన్ని పెంచిందన్నారు ఈశ్వరమ్మ యాదవ్. 40 ఏళ్ల రాజకీయ నాయకురాలిగా, కౌన్సిలర్ గా, కర్మన్జఘాట్ హనుమాన్ దేవస్థాన చైర్ పర్సన్ గా నేను అందించిన సేవలను గుర్తించినందుకే తనకు పదవి ఇచ్చారన్నారు .
తనను ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు వచ్చి ఎందుకు కలుస్తున్నారంటూ శివ చరణ్ రెడ్డి ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పని చేసే తనను కలవడం షరా మామూలేనని పేర్కొన్నారు . తాను కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేయడం జరిగిందన్నారు ఈశ్వరమ్మ యాదవ్. నన్ను పరామర్శించేం దుకు యాదవ, బీసీ సంఘాల నాయకులు ఈ నెల 14న మా ఇంటి వద్దకు వచ్చారు. ఇంటి వద్ద జరిగిన సమావేశంలో సంఘీభావం తెలిపిన అనంతరం నేను వెళ్లిపోయాను. ఆ తరువాత సంఘాల ప్రతినిధులు కొంత ఆవేదనతో రోడ్డుపై నిరసన ప్రదర్శన చేశారు. ఆపై ఆగ్రహంతో దాడి చేసేందుకు వెళ్లారని అన్నారు. ఇప్పటి వరకు తండ్రీకొడుకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు .





