రూ. లక్ష కోట్లతో ఉద్యాన హబ్ గా రాయలసీమ
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను సరి చేయడానికి చాలా సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ నెలా 9 తేదీన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీతో ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తాం అని వెల్లడించారు నెలలో ప్రతీ 3 శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పరిశుభ్రతా ఉద్యమం చేపట్టాం అన్నారు. ఎల్ నినో కారణంగా వర్షాలు పడక కృష్ణా నదికి కూడా నీరు రాలేదన్నారు. జలధార కార్యక్రమం ద్వారా నీటిని సంరక్షించి భూగర్భ జలాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
రైతులు ఈ పరిస్థితుల్ని గమనిస్తూ ఆరు తడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.
గత పాలకులు 5 ఏళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక తట్ట మట్టి పని కూడా చేయలేదని ఆరోపించారు సీఎం . వేదవతి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీరిస్తామని హామీ ఇస్తున్నానని తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్ ఇచ్చాం అని పేర్కొన్నారు సీఎం. కర్నూలు జిల్లాలో వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రూ.1,768 కోట్లతో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం అని ప్రకటించారు. 2028లోగా కడప స్టీల్ పరిశ్రమను నిర్మించి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టాం . హీరో మోటార్స్ సంస్థ, ఎల్ జీ, దాల్మియా లాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. రూ.1 లక్ష కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు సీఎం.