కేంద్ర నిధులూ దారి మళ్లించారు : సీఎం
అమరావతి : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన పథకాల నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేంద్ర నిధుల వినియోగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా కేంద్రం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులను నిర్దేశిత ప్రయోజనాలకే వినియోగించేలా వ్యవస్థను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాటి ప్రభుత్వం చివరకు మద్యం ఆదాయాన్ని ముందుగానే తాకట్టు పెట్టి రూ.25 వేలకోట్లు అప్పులు తెచ్చిందని చంద్రబాబు విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీకి పూర్తి భిన్నంగా మద్యం ఆదాయాన్ని ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు ఉపయోగించారని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో కీలకంగా మారిందని సీఎం తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుందని వ్యాఖ్యానించారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పారు. కేంద్రం సాయం అందిస్తే దాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధిగా మలచుకునేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఓట్లతోనే ఇదంతా చేయగలుగుతున్నామని చంద్రబాబు అన్నారు.