ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతం చేయాలి
అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు . విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ, పుష్కర లిఫ్ట్ స్కీం పైప్ లైన్ పనులపై ఆరా తీశారు. ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఎస్ఈ ఏసుబాబు , ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. హైవే క్రాసింగ్ ల దగ్గర వంతెనల నిర్మాణాల పనులను ఇటీవలే క్షేత్రస్దాయిలో పరిశీలించడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా పనులు ఆశించిన స్దాయిలో జరగకపోవడంపై అధికారులు, ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతిపై సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సిఎం ఆదేశాల ప్రకారం నేడు మరో మారు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో వర్క్ షెడ్యూల్ పై సూచనలు చేశారు. హైవే క్రాసింగ్ ల దగ్గర కొత్తగా నిర్మించిన వంతెనలతో, జాతీయ రహదారి అనుసంధానంపై ఎన్హెచ్ ప్రతినిధులతో సంప్రదింపులు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సిఎం ఆదేశాల ప్రకారం ఆగష్టులోనే అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకెళ్ళేలా పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కర లిఫ్ట్ స్కీం పైప్ లైన్ పనులు పూర్తి చేయడానికి షెడ్యూల్ ప్రకారం పనులు చేయాల్సిందేనని పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.