ప్రతి ఒక్కరికీ ఓ విజన్ ఉండాలి : చంద్రబాబు నాయుడు
విజయవాడ : సమాజానికి ఏమిచ్చాం, దేశానికి ఏం చేశాం అన్నదే లక్ష్యంగా పని చేయాలి అని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఒకరు ప్రకృతి కోసం, మరొకరు పర్యావరణం కోసం, ఇంకోకరు నీటి సంరక్షణ కోసం పని చేయాలన్నారు. రాష్ట్రానికి దేశానికి విజన్ ఉన్నట్టే వ్యక్తిగతంగానూ ప్రతీ ఒక్కరికీ ఓ విజన్ ఉండాలని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ విజన్, చంద్రబాబు అనే నేను 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పన చేశాం అన్నారు. దేశానికి మనం ఏం చేస్తున్నామనే ఆలోచన అంతా చేయాలన్నారు. ఇవాల్టి నుంచి జాతీయ జెండా స్పూర్తిగా పని చేయాలని కోరారు. జాతీయ జెండా, మీ అజెండా తో పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా విజయం సాధించటం నేషనల్ బిల్డింగ్ లో భాగమే. పనిచేసే ప్రతీ వ్యక్తీ సమాజానికి ఆస్తి అని పేర్కొన్నారు. సమాజం కోసం పని చేయటమే గొప్ప దేశభక్తి, అందరి గెలుపు దేశం గెలుపు అని అన్నారు సీఎం.
భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాం అని చెప్పారు . విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరిజన బిడ్డలు ధింసా నృత్యం ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందన్నారు. గిన్నీస్ రికార్డు సాధించి మన సంస్కృతీ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు నారా చంద్రబాబు నాయుడు. పోడు వ్యవసాయం కాదు ఆర్గానిక్ వ్యవసాయంతో గిరిజనులు విలువైన పంటల్ని ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని 27.39 లక్షల మంది గిరిజనుల సమగ్రాభివృద్ధికి రూ.4764 కోట్లను కేటాయించడం జరిగిందని చెప్పారు. ఐటీడిఏలతో గిరిజన అభివృద్ధి కోసం జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రత్యేకంగా దృష్టి సారించాం అని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, ఉపాధి, ఉద్యోగాలు, నైపుణ్య కల్పనపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం అన్నారు.