ఎన్నికల సంఘం తీరుపై ప్రకాశ్ రాజ్ ఫైర్
హైదరాబాద్ : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వస్థలం కర్ణాటక అని, గత కొన్నేళ్లుగా ఓటు వేస్తూ వచ్చానని, తాను అక్కడే చదువుకున్న విషయాన్ని తెలియ చేవానని తెలిపారు. అంతే కాదు తాను ఎన్నికల్లో కూడా పోటీ చేశానని అయినా ఓటు హక్కు ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు ప్రకాశ్ రాజ్. దేశంలో ప్రశ్నించడం నేరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు సంబంధించిన ఓటు హక్కును తొలగించే అధికారం ఎన్నికల సంఘంకు లేదని అన్నారు. ఈ సందర్బంగా ప్రకాశ్ రాజ్ వీడియో విడుదల చేశారు. ఆయన ఇందులో ఎన్నికల పనితీరును ప్రశ్నించారు. ఒక రకంగా ఏకి పారేశారు.
ఎన్నికల అధికారులను సూటిగా ప్రశ్నిస్తూ నిప్పులు చెరిగారు. నా ఓటు శాశ్వతంగా బదిలీ అయిందని వెబ్సైట్లో ఉందన్నారు. అది నిజం కాదా? అని ప్రశ్నించారు. నా ఓటు తొలగించ బడిందని నేను వీడియో చేసిన కొద్ది గంటల్లోనే అధికారులు తమ ప్రకటనను మార్చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రకాశ్ రాజ్. మొదట ‘శాశ్వత బదిలీ’ అని చెప్పారు, ఇప్పుడు కేవలం ‘బదిలీ చేశాం’ అంటున్నారని దేనిని నమ్మాలో అర్థం కావడం లేదన్నారు. నా పాత ఇంటి చిరునామాకు వచ్చిన BLO (బూత్ స్థాయి అధికారి) వల్ల జరిగిన గందరగోళానికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయన్నారు. ఓటు హక్కు కోసం పౌరులు క్యూలో నిలబడి బతిమాలాల్సిన పరిస్థితి ఉండాలా? అని ప్రశ్నించారు.