విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు
అమరావతి : వైసీపీ చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇప్పటి వరకు 14 డీఎస్సీలు నిర్వహిస్తే 11 డీఎస్సీలు తాము నిర్వహించడం జరిగిందన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు లేవన్నారు. మహిళలకు విద్యలో కూడా 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకు వచ్చాం అన్నారు సీఎం. గడచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణలతో మార్పులు తెచ్చామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఐఐఎం లాంటి విద్య సంస్థల సహా పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. 2019-24 మధ్య 10-12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడం మానేశారన్నారు.
అందుకే తల్లికి వందనం పేరిట పిల్లలందరికీ ఆర్ధికసాయం అందించేలా మేం నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు. రాష్ట్రంలో విద్య ప్రమాణాలు పెంచటంతో 1 లక్ష మందికి పైగా విద్యార్ధులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చారని తెలిపారు .గత పాలకులు 5 ఏళ్ల పాటు ఒక్క టీచర్ నియామకాన్ని కూడా చేపట్టలేదని ఆరోపించారు.మేం అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశాం అని చెప్పారు సీఎం. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు చేపట్టామన్నారు నారా చంద్రబాబు నాయుడు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను అత్యంత శ్రద్ధగా చేపట్టాం అన్నారు.