ఏపీలో విద్యా సంక్షోభం..డీఎస్సీ స్కాం : నేహా బోరా
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగం సంక్షోభంలో కూరుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కాక్రోచ్ జనతా పార్టీ నాయకురాలు నేహా బోరా. డీఎస్సీ స్కాం, ఫీజు రీయింబర్స్మెంట్ భారం, కోచింగ్ మాఫియా కొనసాగుతోందని ఆరోపించారు. బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ పాలనలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ఆరపించారు. విజయవాడలో జరిగిన ‘Gen-Z Rising’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు నేహా బోరా సమాధానం ఇచ్చారు. విద్య ద్వారానే మనం మరింత ప్రశ్నించడం నేర్చుకుంటామని అన్నారు. చదువుకోక పోతే ఇబ్బందులు పడతామన్నారు.
ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని చదవాలని కోరారు నేహా బోరా. మన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలన్నారు. ఈ దేశంలో ప్రస్తుతం ప్రజలకు దూరంగా పాలన సాగుతోందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం కులం, మతం ప్రాతిపదికతో ముందుకు వెళుతున్నారంటూ మండిపడ్డారు. కానీ ఈ తరం ఎవరినీ ఉపేక్షించ బోదంటూ పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని, వారి స్వంత హిందూత్వ ఎజెండాను అమలు చేయాలని కుట్రలకు తెర లేపారంటూ ధ్వజమెత్తారు.