సేఫ్ జోన్ లోకి యష్ ‘టాక్సిక్’ మూవీ
హైదరాబాద్ : కేవీఎన్ సంస్థ నిర్మాణంలో గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ నటించిన మూవీ టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలో నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ వసూళ్లలో మాత్రం దూసుకు పోతోంది. రూ. 435 కోట్ల భారీ బడ్జెట్ అయినా ‘టాక్సిక్’ సేఫ్ జోన్లోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (#Toxic) బాక్సాఫీస్ వద్ద సందడిని కొనసాగిస్తోంది. ఈ సినిమాను దాదాపు రూ. 435 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినట్లు టాక్. మొదట్లో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం తీవ్రమైన రిస్క్ అనిపించినప్పటికీ.. సినిమాకు జరిగిన ప్రీ-రిలీజ్ బిజినెస్, థియేట్రికల్ రన్ ఆ రిస్క్ను పూర్తిగా తగ్గించేశాయి.
ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5). అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం జీ5 సంస్థ ఏకంగా రూ. 235 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ లెక్కలు గనుక నిజమైతే.. సినిమా థియేటర్లలోకి రాకముందే సగానికి పైగా పెట్టుబడి నాన్-థియేట్రికల్ రెవెన్యూ రూపంలో రికవరీ అయిపోయింది. :ఇక విడుదలైన మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇదే జోరును కొనసాగిస్తూ ఈ సినిమా లాంగ్ రన్లో రూ. 400 కోట్లకు పైగా థియేట్రికల్ గ్రాస్ను రాబడితే నిర్మాతలకు భారీ లాభాలు రావడం ఖాయం.
ఈ రకంగా కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లపైనే ఆధార పడకుండా ఓటీటీ, శాటిలైట్ డీల్స్, సాలిడ్ ఓపెనింగ్స్తో యష్ ‘టాక్సిక్’ చిత్రం నిర్మాతలకు లాభదాయకమైన ప్రాజెక్ట్గా మారబోతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.