అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. సాధ్యమైనంత మేరకు ప్రజల వద్దకు వెళ్లాలని, ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు వెళితే మిమ్మల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారని చెప్పారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్షిప్ కాన్ క్లేవ్ లో పాల్గొని ప్రసంగించారు చంద్రబాబు నాయుడు. దేశంలో ఏ పార్టీకి లేనంత క్యాడర్ టీడీపీకి ఉందన్నారు. ఓ రాజకీయ నాయకుడు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ప్రజలకు దగ్గరవ్వాలని సూచించారు. ఒకవేళ వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం వాయిస్ మెసేజ్ ద్వారా ఆయినా ప్రజలకు చేరువ కావాలని అన్నారు. ప్రజల సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే వారిలో సానూకూల దృక్పథం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా పబ్లిక్ గ్రీవెన్సులను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా చూడాలన్నారు.
క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ వీటి పరిష్కారం కోసం పని చేయాలని దిశా నిర్దేశం చేశారు నారా చంద్రబాబు నాయుడు. తమకు వస్తున్న ఫిర్యాదుల్లో అధికభాగం భూ వివాదాలే ఉంటున్నాయని అన్నారు . సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నామని వెల్లడించారు. గడచిన 3 ఏళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. రూఫ్ టాప్ సోలార్పై అంతా దృష్టి పెట్టాలన్నారు. ల్యాండ్ రికార్డులు అన్నీ 2027 మార్చినాటికి ప్రక్షాళన పూర్తి అయితే భూ వివాదాలు ముగిసి పోతాయని చెప్పారు. నెలలో కనీసం నాలుగు సార్లు పేదల సేవలో కార్యక్రమంతో ప్రజల్ని కలుస్తున్నాం అని తెలిపారు. జెన్ జీ యువత ఆలోచనల్ని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు సీఎం. రియల్ టైమ్ నిర్ణయాలతో దూకుడుగా జెన్ జీ వర్గం ఉందన్నారు.





