జమ్మూ కాశ్మీర్ అందాలను ఆస్వాదించాలి : రెహమాన్
కాశ్మీర్ : ఆస్కార్ అవార్డు గ్రహీత , సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాశ్మీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని సహజ వైభవాన్ని, సాంస్కృతిక సంపదను, అక్కడి ప్రజల ఆప్యాయతను ప్రశంసించారు. మొట్టమొదటి అంతర్జాతీయ జమ్మూ, కాశ్మీర్ చలన చిత్రోత్సవం ముగింపు అనంతరం మాట్లాడారు. ఈ లోయ ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగంలో మరింత ఎక్కువ గుర్తింపుకు అర్హమైనదని , దాని అందం, శాంతి, కళాత్మక సామర్థ్యానికి గాను ప్రశంసించ బడాలని రెహమాన్ అన్నారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాశ్మీర్ ప్రకృతి సౌందర్యాన్ని, జీవకళను ప్రపంచానికి చాటి చెప్పగల శక్తి వంతమైన వేదికగా ఈ ఉత్సవాన్ని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణం, ఉత్కంఠ భరితమైన దృశ్యాలు స్ఫూర్తిని కోరుకునే చిత్ర నిర్మాతలు, సంగీతకారులు, సృజనాత్మక కళాకారులకు ఆదర్శ వంతమైన గమ్యస్థానంగా నిలుస్తాయని ఆయన నొక్కిచెప్పారు.
కాశ్మీర్ ఒక అందమైన ప్రదేశం, అది దైవ ఆశీర్వాదంతో నిండి ఉంది. ఇక్కడ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నిర్వహించడం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ కాశ్మీర్ అందాన్ని చూడవచ్చు, దాని జీవకళను అనుభవించవచ్చు. ఈ చలనచి త్రోత్సవం ఎంతో ప్రసిద్ధి చెందాలని, చాలా మంది ఇక్కడికి వచ్చి కాశ్మీరీ ప్రజల, భారత ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను అని లోయ యొక్క సాంస్కృతిక, సహజ సంపదపై తన ప్రశంసలను వ్యక్తం చేస్తూ రెహమాన్ అన్నారు. కాశ్మీర్లో సినిమా నిర్మాణ భవిష్యత్తుపై స్పందించారు. సంఘర్షణల ఇతివృత్తాలను పునరావృతం చేయడం కంటే, ఆ ప్రాంతపు ప్రశాంతతను, సహజ సౌందర్యాన్ని చిత్రీకరించడంపై బాలీవుడ్ దృష్టి సారించాలని రెహమాన్ కోరారు.