newsseals.com

జల జీవన్ మిషన్‌తో ఇంటింటికీ తాగు నీరు : అనిత

September 15, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఇల్లు ఉండి పట్టాలు లేని, అర్హులకు త్వరలోనే ఇళ్ల పట్టాలు అందించే చర్యలు చేపడతామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్ర‌క‌టించారు. అలాగే జల జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఎలక్ట్రికల్, పీఆర్ ప్రాజెక్ట్స్, ఎండోమెంట్, పీఆర్ ఇంజినీరింగ్ తదితర శాఖల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు.

పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాయకరావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంత్రి అనిత అన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల‌ని , విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాకు తీసుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయమని మంత్రి అన్నారు. పాయకరావుపేట ప్రాంతంలో పోలవరం కాలువ పరిసరాలను భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.

Related News