అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలి : సీఎం
అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు లేదని బాధ పడకూడదన్నారు. ఇదే నా లక్ష్యమని స్పస్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇచ్చి తీరుతామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్దేశించుకున్న గడువు లోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి కావాలని ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో తన ఛాంబర్ గృహ వసతి పథకంపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి కొలుసు పార్థసారథి తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
2029 నాటికి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన , శాశ్వత గృహవసతి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. ‘అందరికీ గృహవసతి’ (Housing for All) కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మార్చి 2027 నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ మరియు పట్టణ) వంటి వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణ పనులను వచ్చే నెలలోనే ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 2026 నాటికి 2.05 లక్షల ఇళ్లను , మార్చి 2027 నాటికి అదనంగా మరో 2.74 లక్షల ఇళ్లను గృహ ప్రవేశానికి సిద్ధం చేసేలా పూర్తి చేయాలని ఆయన సూచించారు.