newsseals.com

జ‌గ‌న్ ..డైరెక్టర్ ఎవరో కూడా తెలియక పోతే ఎలా..?

September 16, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ‘సాక్షి’ కథనంలో ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా దామోదర్ నాయుడు ఉన్నట్లు పేర్కొనడాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్‌గా లేరని, ఒక మహిళా అధికారి ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. ఒక శాఖకు ప్రస్తుతం డైరెక్టర్ ఎవరో తెలుసు కోవడానికి కూడా కనీస ప్రయత్నం చేయకుండా కథనం రాసి, ప్రభుత్వంపై బురద చల్లితే దాన్ని జర్నలిజం అంటారా? హోంవర్క్ సున్నా.. ఆరోపణలు వంద. వాస్తవాలు సున్నా.. విష ప్రచారం వంద. ఇదే ఇప్పుడు సాక్షి పరిస్థితి అని అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు చివరిసారిగా పాత విధానంలో అవకాశం కల్పిస్తున్నాం. తర్వాత నుంచి APPSC పరీక్షా విధానమే ఉంటుందని ముందుగానే స్పష్టం చేస్తున్నాం. ఇందులో అక్రమం ఎక్కడుంది? అనుమానం ఎక్కడుంది? ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువకుడి చేతిలో అపాయింట్‌మెంట్ ఆర్డర్ చూడాలని మేం కోరుకుంటున్నాం. ఆ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఆపి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ కోరుకుంటోంది. ఇదే మాకూ వాళ్లకూ ఉన్న తేడా అని మంత్రి అన్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు అచ్చెన్నాయుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే తన అనుకూల మీడియాతో అనుమానాలు సృష్టించి నియామక ప్రక్రియను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. యువత భవిష్యత్తుపై రాజకీయ విషం చిమ్మడం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. మీ రాజకీయ కక్షలకు నిరుద్యోగులను బలి చేయొద్దని కోరారు. వాస్తవాలను వక్రీకరించి ఎన్ని కథనాలు రాసినా నిజాన్ని దాచలేరని అన్నారు అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం అవకాశాలు కల్పిస్తుందన్నారు. వైసీపీ–సాక్షి ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువతకు న్యాయం చేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.

Related News