సంజు శాంసన్ టి20 జట్టులో కీలక ఆటగాడు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన కీలకమైన టి20 మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు స్టార్ బ్యాటర్ సంజు శాంసన్. తను కేవలం 22 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 57 పరుగులతో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఈ సందర్భంగా తన ఆటతీరుపై స్పందించాడు గంభీర్. క్రికెటర్ సంజు శాంసన్ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉందన్నాడు. బయట రకరకాల చర్చలు లేదా విమర్శలు వినిపిస్తూనే ఉంటాయని దానిని తాము పట్టించుకోమని పేర్కొన్నాడు హెడ్ కోచ్.
ముఖ్యంగా సంజు శాంసన్ ఇంగ్లాండ్లో కొన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత, అలాగే జింబాబ్వే పర్యటనకు ఎంపిక కానప్పుడు ఈ చర్చలు ఎక్కువయ్యాయని ఆ విషయం తమకు తెలుసన్నాడు. కానీ ఇలాంటి వాటికి మేము ఎప్పుడూ చలించ లేదన్నాడు. సంజు మా T20 జట్టులో ఇప్పటికీ ఒక కీలక సభ్యుడు అని ప్రకటించాడు. భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతాడని కుండ బద్దలు కొట్టాడు. కేవలం కొన్ని రకాల జట్టు కూర్పులను (combinations) ప్రయత్నించడం వల్లే అతను కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడని ఒప్పుకున్నాడు గంభీర్.. T20 ప్రపంచ కప్ సమయంలో అతని సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉండేదన్నాడు. ఇప్పటికీ అలాగే ఉంది. ప్రజలు ఏమైనా అనుకోవచ్చు, కానీ భారత క్రికెట్ శ్రేయస్సు కోసం మేము ఏం చేస్తున్నామో మాకు బాగా తెలుసు అన్నాడు.