వికసిత్ భారత్ లక్ష్య సాధనపై కీలక చర్చలు
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. వికసిత్ భారత్ పై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. సమావేశం అనంతరం దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన ఆర్థిక వనరులు, పెట్టుబడుల సమీకరణ, దేశ ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షత వహించారు.
దేశ ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, రాష్ట్రాల ఆర్థిక పురోగతి, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర–రాష్ట్రాల సమన్వయం తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్తవంతమైన నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తూనే మరో వైపు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా కీలక సూచనలు చేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. వ్యవస్థలు మరింత బలోపేతం చేయడంపై ఏపీ కూటమి సర్కార్ ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు.