మీనాక్షి నటరాజన్ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హై కమాండ్ తన స్థానంలో ఇంకొకరిని నియమించే పనిలో పడింది. ఈ తరుణంలో ఇప్పటికే తనపై ఓ కేసు నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో. ఆ కేసు వేసింది ఎవరో కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు , బాధితురాలైన శ్రీలత. ఆమె తరపున నారాయణపేట జిల్లాకు చెందిన కుంభం శివకుమార్ రెడ్డి నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు మీనాక్షి నటరాజన్ పై.
ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్పై ఇప్పటికే కోర్టులో రెండు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని దాఖలు చేసిన దావాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం సముచితం కాదని, కాబట్టి ఆమె పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ శ్రీలత ఈ పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు విదేశాలకు వెళ్తే న్యాయ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని ఆరోపించారు. ఆమె విదేశీ ప్రయాణాన్ని నిరోధించాలని ఆ పిటిషన్లో పేర్కొనడం కలకలం రేపుతోంది.