
స్పష్టం చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి : జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుందని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ప్రాణధార మందులపై తగ్గించిన పన్నుతో ప్రజలు నేరుగా కొనుగోలుచేసే మందులు, సర్జికల్స్పై రూ.716 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే కొనుగోళ్లలో రూ.250 కోట్లు వరకు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్ల ఆధారంగా ఇకపై సుమారు రూ.1,000 కోట్లు వరకు ప్రజారోగ్యంపై భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు 12%, 5% చొప్పున మందులపై జీఎస్టీ ఉండేదన్నారు. 12% కేటగిరిలోనే 99% మందులు ఉన్నాయని తెలిపారు. 12% పన్నును 5%కు కేంద్రం తగ్గించిందని తెలిపారు మంత్రి. దీనివల్ల ప్రస్తుత మందులపై 7% వరకు పన్ను తగ్గిందన్నారు. క్యాన్సర్, ఇతర అరుదైన కేటగిరిలో ఉన్న 33 రకాల మందులపై 12% వరకు ఉన్న పన్నును కేంద్రం పూర్తిగా తొలగించిందని తెలిపారు. దీనివల్ల ప్రజారోగ్యానికి భారీ ఊరట లభించిందని అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో సుమారు 35 వేల వరకు మందుల దుకాణాలు, 5 వేల వరకు టోకు వర్తక సంస్థలు ఉన్నాయని వెల్లడించారు. వీటి ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 11,250 కోట్ల విలువైన మందులు, సర్టికల్స్ విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. దీని ప్రకారం రూ.1,350 కోట్లు వరకు పన్నుల భారం ప్రజలపై పడినట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగం తెలిపిందన్నారు. ఇకపై ప్రజలు నేరుగా మందుల కొనుగోలు చేయడంపై పడే జీఎస్టీ భారంలో రూ.703 కోట్ల వరకు ఆర్థిక భారం తగ్గిందన్నారు. ఇవి కాకుండా క్యాన్సర్, ఇతర అరుదైన మందుల కొనుగోళ్లు రాష్ట్రంలో రూ.112 కోట్ల వరకు ఉంటుందని అంచనా వీటిపై 12% పన్ను పూర్తిగా తొలగించినందున సుమారు రూ.13 కోట్ల వరకు బాధితులకు ఉపశమనం లభిస్తుందని అంచనా వేశామన్నారు.