
సీఎం చంద్రబాబుపై కామెంట్స్
అమరావతి : ఏపీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఏపీలో పాలన గాడి తప్పిందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. గత రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బ తింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలిసి కూడా చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలన్నారు. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కాదా అని ప్రశ్నించారు. తిరిగి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మళ్లీ ఆల్మట్టి లో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్ల కు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధమయ్యిందన్నారు. నీటినిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీనికోసం రానున్న 3 ఏళ్లలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించిందన్నారు.
కానీ ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించక పోవడం దారుణమన్నారు జగన్ మోహన్ రెడ్డి. గతంలో చక్రం తిప్పానన్నారు కానీ ఏపీకి ఒరిగింది ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కూడా తాను కేంద్రంలో కీ రోల్ పోషిస్తున్నానంటూ బీరాలు పలుకుతున్నారని మరి ఏం సాధించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా మీ ఎంపీల బలంమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాట కూడా వాస్తవమే. మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి, ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేక పోతున్నారంటూ నిలదీశారు చంద్రబాబును. కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకూ మీరెందుకు స్పందించడం లేదన్నారు? అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా? లేదా అని ఫైర్ అయ్యారు.