హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులపై. ఇప్పటికే క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, పార్టీకి లీగల్ నోటీసులు కూడా పంపించారు. విచిత్రం ఏమిటంటే హరీశ్ రావు క్షుద్ర పూజలు చేయించాడని ఏకంగా బాధ్యత కలిగిన టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆరోపించారు. తాజాగా వీరికి వంత పాడుతూ సీఎం సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దశాబ్దాల పాటు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేయించుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు చని పోవాలని, ప్రభుత్వం కూలి పోవాలని కోరుకుంటూ వారు అర్ధరాత్రి భయంకరమైన పూజలు చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు ఎ. రేవంత్ రెడ్డి. ఏ మనిషైనా ఇలాంటి పనులు చేస్తారా? అని ప్రశ్నించారు. నా మీదో లేదా మహేష్ గౌడ్ మీదో లక్ష్యంగా చేసుకుని పూజలు చేయించుకుంటే మేము ఎదుర్కోగలమన్నారు. కానీ ప్రజలనే లక్ష్యంగా చేసుకుని పూజలు చేయించు కోవడం అంటే అర్థం ఏమిటి? అని నిలదీశారు సీఎం. తమ బాత్రూమ్ విశేషాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు, మంచి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి పూజలు చేసినప్పుడు వాటిని ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదంటూ మండిపడ్డారు.






