
రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయిస్ కు సీఎం బిగ్ షాక్
సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. దసరా పండుగ సందర్బంగా కేంద్రం ఉద్యోగులకు తీపి కబురు చెబితే రాష్ట్ర సర్కార్ తీవ్ర ఇబ్బందులు కలిగించేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పెండింగ్ డీఏను తక్షణమే చెల్లిస్తామన్నారని కానీ ఐదు డీఏలు పెండింగ్ పెట్టిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు హరీశ్ రావు.
కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేసిన సర్కార్ నిత్యం విధులు నిర్వహిస్తూ రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంతటి వివక్షను ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
కాంగ్రెస్ అభయ హస్తం కానే కాదని అది పూర్తిగా భస్మాసుర హస్తంగా మారిందంటూ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 73% గరిష్ట పీఆర్సీ అందించిన ఘనత ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ దేనని, ఆ క్రెడిట్ మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి 14 డీఏలు, ఐదు సరెండర్ లీవులు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటు అన్నారు. రూ. 5500 కోట్ల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులను సర్కార్ మళ్లించిందంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందన్నారు. మీ అన్యాయాన్ని అహంకారాన్ని, అరాచకాలను ఎక్కువ రోజులు ప్రజలు సహించ బోరని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి.