నేపాల్ : ఆకస్మిక వరదలు నేపాల్ ను అతలాకుతలం చేశాయి. ఈ ఆకస్మిక వరదల తర్వాత ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ ప్రెసిడెంట్ , సీఈఓ అయిన లక్స్ గోపీశెట్టి అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం.వరదలు సంభవించిన సమయంలో గోపీశెట్టి వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్లో ఉన్నారు. ఈ ఘటన తర్వాత, ఆయన భద్రతను నిర్ధారించడమే తమ ప్రాధాన్యత అని, ఆయన ఆచూకీ కనుగొని, సంప్రదించడానికి సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తున్నామని ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ క్లిష్ట పరిస్థితిలో కంపెనీ గోపీశెట్టి కుటుంబంతో కూడా సంప్రదింపులు జరుపుతూ, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తోంది.
ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ అనేది ఇన్ఫోసిస్ యొక్క అనుబంధ సంస్థ. ఇది ప్రధానంగా అమెరికా , కెనడాలోని ప్రభుత్వ రంగ సంస్థలకు సాంకేతిక , డిజిటల్ సేవలను అందిస్తుంది. గోపీశెట్టి ఈ సంస్థకు ప్రెసిడెంట్ , సీఈఓగా నాయకత్వం వహిస్తున్నారు . నేపాల్ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పెద్ద సంఖ్యలో మరణాలు, గల్లంతైన వారు కూడా ఉన్నారు. ఈ విపత్తు వల్ల పలువురు విదేశీయులు, భారత పౌరులు కూడా ప్రభావితులయ్యారు. సహాయక, పునరావాస చర్యల కోసం భారత్ నేపాల్తో సమన్వయం చేసుకుంటోంది. వరదల వల్ల ప్రభావితమైన భారత పౌరులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా సహాయం అందిస్తోంది.
ఇదిలా ఉండగా, లక్ష్ గోపీశెట్టితో సహా గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా, సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో తమ గాలింపును కొనసాగిస్తున్నాయి.






